ఏపి లో ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో సీఎం జగన్ మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖలో ఖాళీల భర్తీపై ప్రత్యేకంగా దృషి పెట్టాలని తెలిపారు. కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్ నాటికి నియామక ప్రక్రియ ను ప్రారంభించేలా చూడాలని అన్నారు. ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్న నేపథ్యంలో సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిన చేపట్టాలని తెలిపారు.
ప్రధానంగా విదేశాల్లో విద్యార్ధులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి వాటిని కూడా ఇక్కడ విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. వివిధ కోర్సులను పాఠ్య ప్రణాళికలో ఇంటిగ్రేట్ చేయాలన్నారు. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ ఉండాలన్నారు. సర్టిఫైడ్ ఆన్ లైన్ వర్టికల్స్ కరిక్యులమ్ లో భాగం కావాలని చెప్పారు. ఈ తరహా కోర్సుల వల్ల డిగ్రీ పూర్తి అయ్యే నాటికి స్వయం ఉపాధి అందుతుందని తెలిపారు. ప్రఖ్యాత కళాశాలల కరిక్యులమ్ చూసి వాటిని మన దగ్గర అమలు అయ్యేలా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. స్వయం ఉపాధి కల్పించే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ వంటి సంస్థలతో ఈ కోర్సుల కోసం టైఅప్ చేసుకోవాలని చెప్పారు. రిస్క్ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్ మేనేజ్ మెంట్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృషి పెట్టాలనీ, వచ్చే జూన్ నాటికి పాఠ్య ప్రణాళిక లో ఈ కోర్సులు భాగం కావాలని తెలిపారు.
ప్రతి విద్యా సంస్థ కూడా నాక్ అక్రిడిటేషన్ సాధించాలన్నారు. మూడేళ్ల లో కాలేజీల ప్రమాణాలు పెంచుకునేలా వారికి చేయూత నివ్వాలనీ, ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. మూడేళ్ల తర్వాత కఛ్చితంగా ఉన్న విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్ అక్రిడిటేషన్ సాధించాలని స్పష్టం చేశారు. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని చెప్పారు. కళాశాలలకు అనుమతుల విషయంలోనూ యూనిఫామ్ పాలసీ ఉండాలన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నియోజకవర్గాల్లో స్కిల్ సెంటర్ లు ఏర్పాటు చేస్తున్నామనీ, ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుకుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. హై ఎండ్ స్కిల్స్ లో భాగంగా సాఫ్ట్ వేర్ స్కిల్స్ ను కూడా అభివృద్ధి చేయాలన్నారు.
కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. విద్యార్ధులకు సర్టిఫికెట్ ఉంటేనే ఎంప్లాయిమెంట్ పెరుగుతుందని అన్నారు. ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలు కలిపి కరిక్యులమ్ రూపొందించాలన్నారు. సోలార్ పార్క్ లు, సోలార్ మోటార్లు, ప్యానెల్స్ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరత చాలా ఎక్కువగా ఉందనీ, ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటులో ఉండాలని తెలిపారు. పిల్లలు చదువులు ప్రారంభించిన తర్వాత ఏ దశలోనూ డ్రాప్ అవుట్ అన్న పరిస్థితే రాకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు ప్రాధమిక స్థాయిలో అమ్మఒడి, ఉన్నత స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తున్నందున విద్యారంగంలో సుస్థిర లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని సీఎం జగన్ సూచించారు. ట్రిపుల్ ఐటీలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలన్నారు. ఇతర పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Fire Accident: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పరిధిలో భారీ అగ్నిప్రమాదం ..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?