AP CM YS Jagan: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ లు, ట్రాన్స్ పోర్టు బృందాలకు కీలక సూచనలు చేశారు. 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని సూచించారు. అధికారులు నిత్యం మాక్ కాల్స్ చేసి పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో బెడ్స్ సంఖ్యను పెంచాలన్నారు. ఆక్సిజన్ తో సహా కావాల్స్న మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించాలని ఆదేశించారు.
104 కు కాల్ చేస్తే జాప్యం జరగకుండా త్వరితగతిన స్పందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 104కు కాల్ చేసే కరోనా బాధితులకు కఛ్చితంగా సాయం అందాలని జగన్ ఆదేశించారు. 104 కు కాల్ చేస్తే స్పందన లేదంటూ ఇటీవల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ దీనిపై సీరియస్ గా ఆదేశాలు ఇచ్చారు. 104 కు కాల్ చేస్తే ఫోన్ కలవలేదనీ గానీ, స్పందన లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని తెలిపారు. ప్రతి హాస్పటల్ లో ఆరోగ్యమిత్ర విధిగా ఉండాలన్నారు. బెడ్ అవసరం లేదు అన్నవారికి కోవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలని సీఎం జగన్ ఆదేశించారు.
వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట కనిపించకూడదన్నారు. ప్రస్తుతం నెలకు 19లక్షలకు పైగా డోసులే వస్తున్నాయనీ, వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్ వెళ్లడంపై ఆలోచించాలన్నారు. దీనిపై ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్ లు విక్రయించాలనే విషయాన్ని కేంద్రమే నిర్ణయిస్తోందని సీఎం పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకు వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అది కూడా డబ్బును ముందుగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు వ్యాక్సిన్ ఎవరికి వేస్తారనేది ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు చెప్పాలని స్పష్టం చేశారు.
45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోస్ అందేలా చూడాలని సూచించారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ లు బ్లాక్ మర్కెట్ లో అమ్మకుండా చూడాలన్నారు. ఈ ఇంజక్షన్ల వినియోగంపై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆడిటింగ్ ఉండాలన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలుతీరుపై ప్రతి జిల్లా నుండి ప్రతి రోజు నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్ రివ్యూ కమిటీలు సమావేశం కావాలని సీఎం సూచించారు.