AP CM YS Jagan: రాష్ట్ర వ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పందించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అక్రమాలకు పాల్పడిన వారి నుండి సొమ్ము రికవరీపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.40లక్షల మేర సొమ్ము రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ల సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్లు సీఎం వివరించారు. ఈ కుంభకోణానికి సంబంధించి సమగ్ర దర్యాప్తునకు సీఎం జగన్ అదేశించారు.
ఇప్పటికే కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్లను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. 2021 ఏప్రిల్ నుండి జూలై వరకూ 54 నకిలీ చలానాలు గుర్తించారు. నకిలీ చలానాలతో రూ.7లక్షల మేర గోల్ మాల్ జరిగినట్లు నిర్ధారించారు. చలానాల గోల్ మాల్ లో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే క్రమంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 35 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీలు నిర్వహించగా మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.
ఏడు రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ.7.95 లక్షలు విలువైన నకిలీ చలానాలు జత చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో ఏడు కేసులు నమోదు చేసినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు తెలిపారు. పాత సాఫ్ట్ వేర్ స్థానంలో కొత్తది సోమవారం నుండి వినియోగంలోకి రానున్నదనీ, కొత్త సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వస్తే ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశం లేదని డీఐజీ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల లో ఈ కుంభకోణం వెలుగుచూడటంతో ప్రభుత్వం స్పందించింది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.