YS Jagan: ఏపి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలు, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కో ఆర్డినేటర్ లు హజరైయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏడాది మే 11న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని మెజార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు విజయవంతంగా నిర్వహిస్తుండగా, కొందరు మాత్రం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి నెలా నిర్వహిస్తున్న సమీక్షలో ఈ కార్యక్రమంలో ఎవరెవరి ఫెర్పార్మెన్స్ ఎలా ఉందో వివరిస్తూ మెరుగుపర్చుకోవాలని ఆదేశిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్దవంతంగా నిర్వహిస్తూ ప్రజల్లో తిరిగే నాయకులకే రాబోయే ఎన్నికల్లో టికెట్ లు కేటాయించడం జరుగుతుందని, సర్వే రిపోర్టులో నెగిటివ్ గా ఉంటే టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదనీ, ఇందులో ఎటువంటి మొహమాటాలకు తావులేదని కూడా సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవేళ నిర్వహించిన వర్క్ షాపులో ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదికను స్వయంగా సీఎం జగన్ వెల్లడించారు.
దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు కార్యక్రమంలో వెనుకంజలో ఉన్నట్లుగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. నివేదికలో వెనుకబడిన 32 మంది ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారుట. మళ్లీ గడపగడపకు వర్క్ షాప్ వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించబోతున్నట్లుగా స్పష్టం చేస్తూ.. ఆ సమయానికి వీరంతా పని తీరు మెరుగుపర్చుకోవాలని సూచించారుట. ఒక వేళ పని తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారుట. ఇదే క్రమంలో కీలక ప్రకటన కూడా జగన్ చేశారు. వచ్చే వర్క్ షాపులోనే పార్టీ అభ్యర్ధుల జాబితాను కూడా వెల్లడించనున్నట్లు తెలియజేశారుట.