ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో గంజాయితో సహా ఇతర మాదక ద్రవ్యాలు ఎక్కడపడితే అక్కడ దొరకుతున్నాయి. యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు. పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరుకుతుండటం ఆందోళన కల్గిస్తొంది. ఈ నేపథ్యంలో ఏపి సీఎం వైెఎస్ జగన్మోహనరెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో స్పెషల్ ఎన ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), ఎక్సైజ్ శాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. ఏపిలో ఎక్కడా డ్రగ్స్ వినియోగం ఉండకూడదని అన్నారు.
అక్రమ మద్యం, గంజాయి సాగును పూర్తి స్థాయిలో అరికట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, అనర్ధాలను తెలియజేస్తూ వాటికి వ్యతిరేకంగా కళాశాలు, యూనివర్శిటీల్లో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు, యువత మత్తు పదార్ధాల బారిన పడకుండా మాదక ద్రవ్యాలపై పూర్తి అవగాహన కల్పించాలని వివరించాలన్నారు.
అక్రమంగా డ్రగ్స్, గంజాయిని సరఫరా చేసే ముఠా, వ్యక్తులపై దృష్టి సారించాలని సీఎం జగన్ చెప్పారు. అలాగే ఎస్ఈబీ టోల్ ఫ్రీ నంబర్ ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. ఇదే క్రమంలో మహిళలు, యువతులు, ఆడ పిల్లల సంరక్షణకై దిశ యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.