AP CM YS Jagan: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన ఈ నెల 14 తిరుపతిలో 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో ఏపీ సహా తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుఛ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్, నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి గవర్నర్, లక్ష్వద్దీప్ అడ్మినిస్ట్రేటర్ హజరుకానున్నారు. ఈ కౌన్సిల్ సమవేశంపై నేడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సన్నాహాక సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
AP CM YS Jagan: సదరన్ జోనల్ కౌన్సిల్ లో కీలక అంశాలు వచ్చేలా చూడాలి
ఈ సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా అధికారులు చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కీలక అంశాలపై సమావేశంలో చర్చ జరిగితే రాష్ట్రానికి మేలు జరుగే అవకాశం ఉంటుందని అన్నారు. ఏపి విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపర్చాలని అధికారులకు జగన్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలు, రెవెన్యూ లోటు, తమిళనాడు నుండి తెలుగు గంగ ప్రాజెక్టు కు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. అదే విధంగా రేషన్ బియ్యంలో హేతుబద్దతలేని రీతిలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుండి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిల అంశాలనూ చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రత్యేక హోదా అంశం కూడా
ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని ఈ సన్నాహక సమావేశంలో సీఎం జగన్ నిర్ణయించారు. కేఆర్ఎంబీ పరిధిలో జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని, నదుల అనుసంధానంపై కేంద్ర ప్రతిపాదనల మీద సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలప వివరాలు తయారు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. కౌన్సిల్ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఉంటే వాటిపై కూడా తగిన రీతిలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.