రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకురాకుండా సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు టెంకాయ కొట్టి శంకుస్థాపన అని ప్రకటించుకున్నారని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. అయిదు సంవత్సరాలు ఏమి చేయకుండా ఎన్నికలకు ముందు పోర్టుకు శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెట్టిందని అన్నారు. బుధవారం పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ భూసేకరణ, డీపీఆర్ లేకుండానే గత ప్రభుత్వం శంకుస్థాపన హడావుడి చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం అన్ని క్లీయరెన్స్ లతో పక్కాగా ముందుకు సాగుతోందనీ, ఇది ప్రజలు గమనించాలని కోరారు సీఎం జగన్.
పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, రుణాలు మంజూరు చేసిన బ్యాంకులకు ఈ సందర్భంగా జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. పోర్టులో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని మరో సారి స్పష్టం చేశారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ చట్టం తెచ్చిన ప్రభుత్వం తమదేనని అన్నారు. రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుందనీ, తద్వారా ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. పోర్టు వల్ల రవాణా ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతాయన్నారు. ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాది దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులు కాకుండా మరో నాలుగు పోర్టులు తేబోతున్నామని చెప్పారు. తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, నాలుగు పోర్టుల పనులు వేగవంతం చేశామనీ, త్వరలోనే మిగతా వాటికి భూమి పూజ చేస్తామని సీఎం జగన్ తెలిపారు.