అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. తక్షణమే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఫ్యాక్టరీ తెరవకూడదని ఆదేశాలు ఇచ్చింది. బాధితులకు మెరుగైన వైద్యం అందిలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా అచ్యుతాపురం సెజ్ లో గ్యాస్ లీకైన ఘటన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి గుడివాడ అమరనాథ్ బుధవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి అమరనాథ్ మీడియాతో మాట్లాడుతూ .. గతంలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరుగుతుండగానే మరో సారి ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. సీడ్స్ కంపెనీలో 121 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. బాధితులను అయిదు ఆసుపత్రుల్లో జాయిన్ చేసి వైద్యసేవలు అందిస్తున్నామనీ, బాధితుల్లో ఎవరికీ ప్రాణపాయం లేదని తెలిపారు. బాధితుల చికిత్సకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వెల్లడించారు.
ప్రాధమిక విచారణలో కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు తేలిందనీ, జరిగిన ప్రమాదంపై నమూనాలు ఐసీఎంఆర్ కు పంపుతున్నట్లు తెలిపారు. జరిగిన తప్పు పనరావృత్తం కాకుండా సీడ్స్ కంపెనీ చూసుకోవాలని అన్నారు. ప్రస్తుత ప్రమాదంపై ఉన్నత సాథయి కమిటీ విచారణ కు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అచ్యుతాపురం సెజ్ లో గ్యాస్ లీక్ ప్రమాదాలు జరుగుతూ వందలాది మంది అస్వస్థతకు గురవుతున్న ఘటనపై టీడీపీ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించారు. గత నెలలో జరిగిన ప్రమాదంలో దాదాపు 300 మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు.