రుణ యాప్ వలలో పడి రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు కొల్లి దుర్గరావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అనాధలైన చిన్నారులు నాగసాయి (4), లిఖిత శ్రీ (2) ను ఆదుకోవడానికి చేరో రూ.5లక్షలు సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ కే మాధవీలతకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో లోన్ యాప్ ఆగడాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని లోన్ యాప్ లపై కఠనంగా వ్యవహరించాలని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగికి చెందిన కొల్లి దుర్గాప్రసాద్ (32), రమాలక్ష్మి (24) దంపతులు గత కొంత కాలంగా రాజమహేంద్రవరంలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. దుర్గారావు జొమాటో డెలివరీ బాయ్ గా, ఆయన భార్య రమ్యలక్ష్మి మిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు కొద్ది రోజుల క్రితం ఇంటి అవసరాల కోసం సెల్ ఫోన్ ద్వారా లోన్ యాప్ లో కొంత సొమ్మును రుణంగా తీసుకున్నారు. ఈ లోన్ సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. ఈ తరుణంలో లోన్ యాప్ కు సంబంధించిన టెలీకాలర్స్ తరచూ ఫోన్ చేసి వేధించడంతో పాటు మీ నగ్నచిత్రాలు మా వద్ద ఉన్నాయి. అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం అని బెదిరించారు. దీనికి తోడు అతని బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని వారు చెప్పారు. దీంతో పరువు పోయిందన్న అవమానంతో భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.