టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో సారి ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష కార్యక్రమాన్ని బుధవారం సీఎం జగన్ ప్రారంభించరు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ..తనకు తాను పార్టీ పెట్టుకుని ఎవరైనా అధికారంలోకివస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని, సొంత కుతురును ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయన పెట్టిన పార్టీని సొంతం చేసుకుంటే వారిని చంద్రబాబు అంటారని జగన్ అన్నారు. రావణుడిని సమర్దించిన వారిని రాక్షసులని, దుర్యోధనుడిని కొమ్ము కాసిన వారిని దుష్ట చతుష్టయం అని అంటారని, అలాంటి చంద్రబాబును ఏమనాలని జగన్ ప్రశ్నించారు.
నేడు ప్రజాస్వామ్యానికి అర్ధం లేకుండా పోయిందన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక సారి కాదు, రెండు సార్లు అనేక సార్లు ప్రజలను మోసం చేశారని, అటువంటి చంద్రబాబుకు మరోసారి అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపాలా, మీసేవలు మాకొద్దు బాబోయ్ అని గుడ్ బై చెప్పి ఇంటికి పంపాలా అని ప్రజలు ఆలోచించాలని కోరారు. చంద్రబాబుకు మరో ఛాన్స్ ఇవ్వవచ్చా అని జగన్ ప్రశ్నించారు. ఇవేళ రాజకీయాలు చాలా దారుణంగా తయారైయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన జగన్.. రాజకీయాల్లో నలుగురు తోడు ఉండే ప్రజల గురించి ఆలోచించాల్సిన పని లేదన్నట్లుగా తయారైయాయని అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబు కు లేదని విమర్శించారు. తాను దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదనీ, కేవలం దేవుడు, ప్రజలను నమ్ముకున్నానని జగన్ అన్నారు. వాళ్లు చెప్పే అబద్దలు ప్రజలు నమ్మవద్దనీ, తమ ఇళ్లల్లో మంచి జరిగిందా లేదా అన్నదే కొలమానంగా పెట్టుకుని మంచి జరిగితే జగన్ కు అండగా నిలవాలని ప్రజలకు కోరారు సీఎం జగన్.
రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం రీసర్వే చేసి భూహక్కు పత్రాలను అందిస్తున్నామని జగన్ తెలిపారు. అత్యాధునిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నామన్నారు. 17వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో భూముల సర్వే చేస్తున్నామనీ, రెండేళ్ల క్రితం ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు. తొలిదశలో రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన జరిగాయన్నారు. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలను అందించామనీ, ఫిబ్రవరి లో రెండో దశ నాలుగు వేల గ్రామాల్లో సర్వే, మే 2023 కల్లా ఆరు వేల గ్రామాల్లో భూహక్కు పత్కాలు, ఆగస్టు 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతుందని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తి అవుతుందని చెప్పారు.
ఇప్పటి వరకూ సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల సివిల్ కేసులతో రైతులు నష్టపోతున్నారనీ, ఆ పరిస్థితులను మార్చాలని అడుగులు ముందుకు వేయడం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. తమ ఆస్థిని కుటుంబ సభ్యులకు సక్రమంగా అందజేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. ఇక రిజిస్ట్రేషన్ కూడా గ్రామ సచివాలయాల్లోనే జరుగుతాయని జగన్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ బాధితులను కూడా పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డయాలసిస్ రోగులకు పదివేల చొప్పున ఇస్తున్నామన్నారు. ఇదే క్రమంలో నరసన్నపేట ఆర్ అండ్ బీ రహదారి విస్తరణ, మలపం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.