ఏపి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని పేర్కొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర అప్పులపై ఎల్లో మీడియా, చంద్రబాబు రోజు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపి అసెంబ్లీలో శుక్రవారం పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కోవిడ్ సహా ఎన్నో సవాళ్లు ఎదురైనా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అద్భుతంగా ఉందని అన్నారు. కేంద్రంతో పోలిస్తే ఏపి అప్పులు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే తక్కువే అని గణాంకాలతో వివరించారు.
గ్లోబెల్స్ ప్రచారంలో భాగంగా అబద్దాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు సీఎం జగన్. రాష్ట్రం బాగున్నా ఒక పద్దతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారనీ, రాష్ట్ర జీడీపీ పెరుగుదల గతంలో కంటే బాగుందని వివరించారు. అప్పుల గురించి జరుగుతున్న దుష్ర్పచారంపై రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నారు. దేశ జీడీపీలో గతంలో రాష్ట్ర వాటా 4.45 శాతం ఉంటే ఇప్పుడు 5 శాతానికి పెరిగిందన్నారు. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో జీడీపీ పెరుగుదల నమోదైందనీ, ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపి ఒకటి అని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు సీఎం జగన్. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్లే ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడిందన్నారు.
అమ్మఒడి, చేయూత, అసరా పెన్షన్లు, రైతు భరోసా వంటి పథకాల తో పేదలను ఆదుకోవడం వల్ల ఏపి పాజిటివ్ గ్రోత్ రేట్ సాధించిందని వివరించారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామనీ, సరైన సమయంలో ప్రజలకు ఆర్ధిక చేయూత అందించామని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని జీర్ణించుకోలేక దుష్టచతుష్టయం అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం అనంతరం స్పీకర్ తమ్మినేని సభను సోమవారం ఉదయానికి వాయిదా వేశారు.
రెండో రోజు ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం .. కడప స్టీల్ ప్లాంట్ పై మాటల యుద్ధం