రాష్ట్రంలో విద్యా రంగం మాదిరిగా వైద్య ఆరోగ్య రంగంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడా జరగని విధంగా మార్పులు చోటు చేసుకున్నాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో ‘వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు’పై స్వల్ప వ్యవధి చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మనం అధికారంలోకి రాక ముందు ఆస్పత్రుల పరిస్థితి చూస్తే, గ్రామం మొదలు రాష్ట్ర స్థాయి వరకు శిధిలావస్తకు చేరుకున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో మనం చూశాం. ఆస్పత్రిలో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశామన్నారు. చివరకు సెల్ఫోన్ లైట్ వెలుగులో ఆపరేషన్ చేయడం కూడా చూశామన్నారు. దీంతో మనసు పెట్టి ఈ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది ఆలోచించామని జగన్ తెలిపారు. ఏపిలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు లేవని చెప్పారు.
పేద వర్గాలకు ఉచిత వైద్య సేవలు అందించాలని తొలుత రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ని దివంగత సీఎం వైఎస్ఆర్ తీసుకువచ్చారన్నారు. ఆయన హయాంలో సామాన్యులు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందారన్నారు. నిరుపేదలు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్న ఉద్ధేశంతో ఆయన ఆ పని చేశారని చెప్పారు.ఆ తర్వాత చంద్రబాబు హయాంలో ఆరోగ్య శ్రీని నీరు గార్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గత ప్రభుత్వం రూ.680 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిపెట్టి పోయిందన్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల్లో సామాన్యులకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం అందలేదన్నారు. అలాంటి పరిస్థితి నుంచి వాటిని బాగు చేయడం కోసం ఒక డాక్టర్గా చికిత్స మొదలుపెట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆస్పత్రి ఎవరిది అన్నది చూడకుండా, అన్ని ఆస్పత్రులకు వెంటనే బకాయిలు చెల్లించామనీ, అందుకే బాలకృష్ణకు చెందిన ఆస్పత్రికి కూడా చంద్రబాబు హయాంలో కంటే చాలా వేగంగా బిల్లుల చెల్లింపు జరుగుతోందని జగన్ తెలిపారు.
వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న అన్ని కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడంతో 95 శాతం కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని సీఎం జగన్ వివరించారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ఈ అక్టోబరు 5వ తేదీ నుంచి ఏకంగా 3118 ప్రొసీజర్లకు పథకం వర్తింప చేస్తున్నామని చెప్పారు. వైద్య–ఆరోగ్య రంగంలో నాడు–నేడు కింద ఆస్పత్రుల రూపురేఖలు మార్చడం కోసం రూ.16,255 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైద్య రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని సీఎం వివరించారు. ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నామని, ఇప్పటికే దాదాపు 40,800 మందిని నియమించడం జరిగిందన్నారు. ప్రతి ఆస్పత్రిలో అవసరం మేరకు డాక్టర్లు, నర్సులు ఉండేలా కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పుడు కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా, వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా మరో 17 కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. పాడేరు, విజయనగరం, నర్సీపట్నం, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పులివెందుల, పెనుకొండ, ఆదోని, నంద్యాల, పార్వతీపురంలో వైద్య, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీకి ముందు పెగాసస్ మధ్యంతర నివేదిక..!!