పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ఏపి సీఎం వైఎస్ జగన్ అన్నారు. బాపట్ల లో జగనన్న విద్యాదీవెన పథకాన్ని ఆయన ప్రారంభించారు. మూడో విడత జగనన్న విద్యాదీవెన పథకం కింద గురువారం సీఎం జగన్ రూ.694 కోట్ల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లలో విద్యారంగ అభివృద్ధికి రూ.53వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. విద్యాదీవెన పథకం కింద 11.02 లక్షల మంది విద్యార్ధులు లబ్దిపొందుతున్నారని చెప్పారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. కుటుంబంలో ఎంత మంది విద్యార్ధులు ఉన్నా ప్రతి ఒక్కరికీ జగనన్న విద్యాదీవెన పథకం అందిస్తున్నామనీ, ఫీజు ఎంతైనా సరే మొత్తం చెల్లిస్తున్నామని తెలిపారు. నేరుగా తల్లుల ఖాతాలోనే ఈ విద్యాదీవెన మొత్తాన్ని జమ చేస్తున్నామని జగన్ చెప్పారు.
ప్రతి ఇంటి నుండి ఇంజనీర్ లు, డాక్టర్లు, ఐపీఎస్ లు రావాలనీ, వారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రభుత్వం పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించిందన్నారు. పేదలకు పథకాల కింద ఉచితంగా డబ్బులు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక లా మారుతుందంటూ కొన్ని శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
గత పాలనలో రాష్ట్రంలో నలుగురే బాగుపడ్డారనీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వారికి కడుపుమంట అని అందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మద్య తేడాను ప్రజలు గమనించాలన్నారు. వారికి మాదిరిగా మీడియా, దత్తపుత్రుడి మద్దతు లేకపోయినా తనకు ప్రజల దీవెన, దేవుడి దయ ఉందని జగన్ అన్నారు. ఇదే సందర్భంలో బాపట్ల పట్టణంలో అడిషనల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు సంబంధించి రూ.18కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. బాపట్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు..
సీఎం వైఎస్ జగన్ కు రాఖీలు కట్టిన మహిళా మంత్రులు, నేతలు