YS Jagan: రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటాననీ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి వద్ద రూ.270 కోట్లతో నిర్మిస్తున్న అసాగో ఇండస్ట్రీస్ బయో ఇథనాల్ యూనిట్ కు సీఎం జగన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ .. దేవుడి దయతో ఇవేళ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
దావోస్ పర్యటనలో అనేక మంది పారిశ్రామిక వేత్తలను కలిశానని చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఏపి లో మంచి వాతావరణం ఉందన్నారు. టెక్నాలజీకి సంబంధించిన మాటలు మాట్లాడుతున్న సమయంలో టెక్ మహేంద్రా గ్రూపు సీఇఓ సీపీ గుర్నానీ ఇథనాల్ కు సంబంధించి పరిశ్రమ గురించి అడిగారన్నారు. కేవలం ఆరు నెలల్లోనే భూములు ఇవ్వడం దగ్గర నుండి అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దీంతో టెక్ మహేంద్రా గ్రూపు రూ.280 కోట్లతో ఈ ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తొందని చెప్పారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. బ్రోకెన్ రైస్ తో ప్లాంట్ లో ఇథనాల్ తయారీ చేస్తారని చెప్పారు. ప్లాంట్ తో పాటు బై ప్రొడక్ట్ కింద పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రొటీన్ ఫీడ్ కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రంగు మారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుందని సీఎం అన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ కు ఏపి ఒక ఉదాహరణగా నిలిచిందన్నారు. సీపీ గుర్నానీ ఇతర పారిశ్రామిక వేత్తల వద్ద కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తారని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఏలూరు కుడి కాల్వ నిర్మాణానికి సంబంధించి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. దీని వల్ల రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్ మహేంద్ర సీఈఓ సీపీ గుర్నానీ, అశీష్, మంత్రులు గుడివాడ అమరనాథ్, తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాల కృష్ణ, ఎంపీలు భరత్ రామ్, అనురాధ, వంగా గీత, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.