టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో సోమవారం సీఎం వైఎస్ జగన్ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో మాట్లాడిన భాషను, మాటలపై స్పందించారు. చంద్రబాబులో ఇదే తన చివరి ఎన్నికలు అన్న భయం కనిపిస్తుందని అన్నారు. భగ్నప్రేమికుడు చంద్రబాబు ఇవే తన చివరి ఎన్నికలని రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నారని చెప్పారు. తాను గెలిస్తే ఏం చేస్తానో చెప్పకుండా తనను గెలిపించకపోతే చివరి ఎన్నికలని బ్లాక్ మెయిల్ మాత్రం చేస్తున్నారని జగన్ అన్నారు.
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా, జనసేనను రౌడీ సేనగా మార్చేశారని అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారని, రాబోయే ఎన్నికల్లో గుడ్ బై చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లోనూ వైసీపీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారనీ, చివరకు కుప్పంలోనూ వైసీపీనే గెలిపించారని జగన్ గుర్తు చేశారు. వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, తన పార్టీ కేబినెట్ లో స్థానం ఇచ్చినందుకు ఇదేం ఖర్మరా బాబు అనుకుని ఉంటారని ఎద్దేవా చేశారు. 45 ఏళ్లలో ఎప్పుడు చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తున్నామని జగన్ చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించిందని తెలిపారు. కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే తమకు మద్దతు ఇవ్వమని జగన్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ను ప్రజలు నమ్మవద్దని, ప్రజలకు మంచి జరిగిందాలేదా అనేది కొలమానంగా తీసుకోవాలని అన్నారు. మంచి జరిగితే వైసీపీకి అండగా, తోడుగా నిలబడాలని జగన్ సూచించారు. చంద్రబాబు ప్రతి మాటలోనూ భయం కనబడుతుందని ఆయన అన్నారు.
నరసాపురం రూపు రేఖలు మార్చేందుకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జగన్ అన్నారు. ఫిషరీస్ యూనివర్శిటీ తో నరసాపురం రూపు రేఖలు మారతాయన్నారు. అక్వారంగం నర్సాపురానికి ఎంత ప్రధానమైందో తెలుసునన్నారు. ఫిషరీస్ వర్శిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే ఉన్నాయన్నారు. అక్వా కల్చర్ సుస్ధిర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేశంలో మూడవ ఫిషరీస్ యూనివర్శిటీ ఏపిలో రాబోతున్నదని, రూ.332 కోట్ల తో ఫిషరీస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని జగన్ అన్నారు. ముమ్మిడివరంలో వేట కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్నామన్నారు. వేట కోల్పోయిన వారికి రెండో దఫా పరిహారం అందిస్తున్నామని చెప్పారు, జగనన్న ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అనుకునేలా పాలన చేస్తున్నామనీ, ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను నెరవేరుస్తున్నామని జగన్ పేర్కొన్నారు.
YS Jagan: కేంద్రంతో వైసీపీ ప్రభుత్వ బంధంపై సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీ ఇది