న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి 7వ సమావేశం రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో జరిగింది. పంటల మార్పిడి, నూనె దినుసలు, పప్పు దినుసల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక పాలనపై సమావేశంలో చర్చ జరిగింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపి సిఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యిందన్నారు. 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగంమీదే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటేనని చెప్పారు. అందుకే వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. రైతులను ఆదుకునేందుకు వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఉచిత పంటల బీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటల పాటు ఉచిత విద్యుత్ తదితర పథకాలు రైతులను అమలు చేస్తున్నామని చెప్పారు. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నామని వివరించారు. డిజిటిల్ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎంయాప్ను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు.
ఇక విద్యా రంగం విషయానికొస్తే బడికి వెళ్లడం, చదువు కోవడం అన్నది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు జగన్. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్ నిష్పత్తి 99.21 శాతం కాగా, ఏపీలో ఇది 84.48 కావడం విచారకరమన్నారు. 2018లో కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల్లో విద్యా రంగంలో రాష్ట్రం పనితీరు అత్యంత దారుణంగా ఉందని వెల్లడైందన్నారు. అందుకే విద్యా రంగంలో కీలక అంశాలపై దృష్టి పెడుతూ సమర్థవంతమైన విధానాలను తీసుకు వచ్చామని వివరించారు సీఎం జగన్. ఏపిలో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్ యాప్ కూడా అందిస్తున్నామని చెప్పారు. మన బడి నాడు – నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిషు భాషకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చక్కటి పునాది వేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యా స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయిన్నారు.
పౌరుల గడపవద్దకే సేవలందించే విధానంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టామని వివరించారు. వీటికి సంబందించి పూర్తి స్థాయి నోట్ను కూడా సీఎం జగన్ సమర్పించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?