గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. నిన్న కోనసీమ లంక గ్రామాల్లో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలోని వరద ముంపునకు గురైన గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ తక్షణ సాయం, నిత్యావసర వస్తువులు అందాయా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంలో బాధిత కుటుంబాలు తమకు ప్రభుత్వం నుండి తక్షణ సాయం అందిందనీ, నిత్యావసర వస్తువులు అందించారనీ, అధికారులు, వాలంటీర్లు సేవలు అందించారని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ .. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పని చేశారని ప్రశంసించారు. వరద సహాయ చర్యల్లో అధికార యంత్రాంగం అంతా పాల్గొందని చెప్పారు. ఇంత పారదర్శకంగా గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఎన్యుమరేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని సీఎం జగన్ తెలిపారు.
ఇళ్లు కోల్పోయిన వారికి పది వేలు సాయం
వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10వేల ఆర్ధిక సాయం ఇవ్వాలని అదేశించామని సీఎం జగన్ తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ లోనే సాయం అందిస్తామని చెప్పారు. గోదావరి వరద పరిస్థితులను ప్రధాన మంత్రి మోడీకి వివరిస్తామని, తక్షణం సాయం అందించాలని కోరతామన్నారు సీఎం జగన్ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ముంపు ప్రాంతాల పునరావాస ప్యాకేజీ నిధులకై కేంద్రానికి పలు మార్లు విజ్ఞప్తి చేయడం జరిగిందని చెప్పారు. ఏలూరు జిల్లా తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను పరామర్శించిన తర్వాత సీఎం జగన్ తాడేపల్లికి చేరుకున్నారు. ఈ పర్యటనలో మంత్రులు చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ, గుడివాడ అమరనాథ్, కారుమూరు నాగేశ్వరరావు తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.