నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో నిర్మాణం పూర్తి అయిన జెన్ కో మూడో యూనిట్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం కృష్ణపట్నం పోర్టు పరిధిలో చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ఆర్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును తాను ఈ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో నేడు మరో ముందడు పడిందని చెప్పారు. రాష్ట్రంలో గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగదారులందరికీ రోజంతా కూడా నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ను అందించడంతో పాటు వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా 9 గంటలు విద్యుత్ సరఫరా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ థర్మల్ స్టేషన్లోని ఈ ప్రాజెక్టుకు అక్షరాల రూ.3,200 కోట్లు ఇచ్చి యుద్ధ ప్రాతిపాదికన మూడున్నరేళ్లలో పూర్తి చేశామని చెప్పారు.
రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 40 శాతం ఏపీ జెన్కో ద్వారా ఉత్పత్తి చేస్తున్నామన్నారు సీఎం జగన్. ఈ ప్లాంట్ నుంచి రోజుకు 19 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుమని చెప్పారు. ఏపీ గ్రిడ్కు ఇక్కడి నుంచి సరఫరా అవుతుందనీ, సాధారణ ప్లాంట్తో పోలిస్తే..ఈ ప్లాంట్ తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. దీని వల్ల కాలుష్యం కాస్తో కూస్తో తగ్గించవచ్చునని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్ కో మూడో యూనిట్ ను జాతికి అంకితం చేస్తున్నామని అన్నారు. ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలియజేసిన సీఎం జగన్.. ఇప్పటికే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామనీ, మరో 150 కుటుంబాలకు నవంబర్ నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
గతంలో ఓట్ల కోసం చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చారని విమర్శించారు సీఎం జగన్. ప్రజలందరికీ మంచి చేయాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎన్నికలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజ్ఞప్తి పై హైలెవల్ వంతెనను మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
RGV: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సంచలన దర్శకుడు ఆర్జీవీ భేటీ .. భేటీలో ట్విస్ట్ ఏమిటంటే..?