తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) మరోసారి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ .. రాత్రి తిరుమలలోనే బస చేశారు. బుధవారం ఉదయం ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ ధర్మారెడ్డి లు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు కొట్టు సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఆర్కే రోజా, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భుమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూధనరెడ్డి ఉన్నారు.
సీఎం జగన్ కు రంగనాయకుల మండపం వద్ద ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం రూ.22 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని సీఎం జగన్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నూతన అతిధి గృహాన్ని జగన్ ప్రారంభించారు. తదుపరి సీఎం జగన్ తిరుమల నుండి రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అయ్యారు.