ఏపిలోని ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గోదావరి పరివాహన ప్రాంతాలు ఇటీవల వరదలో మునిగిన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు ఇప్పటికే ప్రభుత్వం పరిహారం, నిత్యావసరాలు పంపిణీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీపీఐ నేత నారాయణ పర్యటించి బాధితులను పరామర్శించారు. అటు తెలంగాణలో భద్రాచలం ప్రాంతంలో సీఎం కేసిఆర్. గవర్నర్ తమిళిసై వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు గానీ నేరుగా ఆయా ప్రాంతాల్లో ఇంత వరకూ పర్యటించలేదు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 50కి పైగా గ్రామాలు వరద ముంపునకు గురైయ్యాయి, వేలాది ఎకరాల పంటలు ముంపు బారిన పడ్డాయి. ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టడం, ఎప్పటికప్పుడు సీఎం ఆయా జిల్లాల అధికారులతో సమీక్షలు జరపడం తదితర చర్యలతో ప్రాణనష్టం జరగలేదు. కేవలం ఆస్తినష్టం సంభవించింది.
ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేరుగా క్షేత్ర పరిశీలన చేయకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో వైసీపీ దిద్దిబాటు చర్యలకు సిద్దమైంది. గోదావరి వరద క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ నెల 26న వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడనున్నట్లు వైసీపీ ప్రకటించింది. రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగుతుందని వైసీపీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆ మరునాడు కూడా వరద ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేయడంతో పాటు వరద బాధితులతో మాట్లాడేందుకు జగన్ ఈ పర్యటనకు బయలుదేరుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో మంత్రులు, ఆయా ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంతకు ముందే పర్యటించారు.