AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి గన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంలో తరగతి గదిలో గ్రీన్ బోర్డుపై ఆల్ ద వెరీ బెస్ట్ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్ విద్యార్థులతో ముచ్చటించి పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న పలు సౌకర్యాలను పాఠశాల సిబ్బంది సీఎం జగన్ కు వివరించారు. పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని స్వయంగా సీఎం విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ బ్యాగ్ లను, విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించి మెనూను సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం మనబడి నాడు నేడు ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలాన్ ఆవిష్కరించి సిఎం జగన్ ప్రారంభించారు.
మన బడి నాడు నేడు ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను అధునీకరించారు. నేటి నుండి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న సందర్భంగా సీఎం వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం నాడు నేడు కింద రెండో విడత చేపట్టనున్న పాఠశాలల పనులను సీఎం జగన్ ప్రారంభించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.
అనంతరం జరిగిన సభలో కోవిడ్ నేపథ్యంలో మూత బడిన పాఠశాలలను ప్రారంభించడం జరిగిందన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పాఠశాల తరగతులు నిర్వహించాలని ఆదేశించడం జరిగిందన్నారు. పాజిటివిటీ రేటు పది శాతం కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలు అన్నీ తెరవాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే కూర్చునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యావ్యవస్థకు మెరుగుకు తీసుకుంటున్న చర్యలు, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సీఎం జగన్ వివరించారు.