Law Nestham: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ జగన్మోహనరెడ్డి సర్కార్ సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సంక్షేమ క్యాలెండర్ కు అనుగుణంగా వివిధ పథకాల లబ్దిదారులకు సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా జగన్ సర్కార్ ఈ రోజు అర్హులైన జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం పథకం కింద ఆర్ధిక సాయం పంపిణీ జరగనున్నది. 2,011 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంకు ఖాతాలో రూ.1.05 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. కొత్తగా లా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తున్నది జగన్ సర్కార్. మూడున్నరేళ్లలో లా నేస్తం పథకం కింద మొత్తంగా రూ.35.40 కోట్లు ఆర్ధిక సాయం చేసింది ప్రభుత్వం.
ఈ పథకానికి సంబంధించి మొత్తాన్ని బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయనున్నారు సీఎం జగన్. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చే ఈ పథకానికి వైఎస్ఆర్ లా నేస్తంగా పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడే వరకూ అంటే దాదాపు మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల చొప్పున ఆర్ధిక సాయంగా అందిస్తూ వస్తున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటం పట్ల యువ న్యాయవాదులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Garuda bus accident: ఆర్టీసీ గరుడ బస్సు బొల్తా .. పది మందికి గాయాలు