విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. కాగా రేపు (ఆదివారం) ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవేళ సెక్యూరిటీ ట్రయల్ రన్ నిర్వహించారు. మూలా నక్షత్రం నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకుంటారు. అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు సమర్పిస్తారు.
మరో పక్క మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవేళ రాత్రి నుండి క్యూలైన్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్నందున కొండపైకి వాహనాలను అనుమతించబోమని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆదివారం ప్రత్యేక టికెట్ దర్శనాలు ఉండవనీ, అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనాలేనని అధికారులు తెలిపారు.
జనంలో ఉన్న వారికే ఎన్నికల్లో సీట్లు .. మరో సారి స్పష్టం చేసిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్