AP CM YS Jagan: ఏపిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తుంది. వ్యాక్సిన్ కొరతతో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. వ్యాక్సిన్ కొరత కారణంలో రాష్ట్రంలో నిన్న, ఈ రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరా, వ్యాక్సిన్ సమస్యలను జగన్ లేఖలో ప్రస్తావించారు.
ఏపికి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రధాన మంత్రి మోడీని జగన్ కోరారు. ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేస్తున్నా అది ఏమాత్రం సరిపోవడం లేదని పేర్కొన్నారు. తమిళనాడు నుండి ఏపి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యం కావడం వల్ల తిరుపతి రూయా ఆసుపత్రిలో 11 మంది కోవిడ్ బాధితులు ప్రాణవాయువు అందక మృతి చెందిన విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడు, కర్నాటక నుండి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నామని అది సరిపోవడం లేదని తెలిపారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపికి మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం కర్నాటక నుండి దిగుమతి చేసుకుంటున్న 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 150 మెట్రిక్ టన్నులకు పెంచాలనీ, అదే విధంగా ఒడిశా నుండి దిగుమతి చేసుకుంటున్న 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 400 మెట్రిక్ టన్నులకు పెంచాలని ప్రధాని మోడీని జగన్ కోరారు.
మరో ప్రధానమైన విషయం వ్యాక్సిన్ గురించి ప్రస్తావిస్తూ.. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని కోరారు. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి, వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సహకరించాయన్నారు. ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోడిని వైఎస్ జగన్ కోరారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయవచ్చని జగన్ వివరించారు.