AP CM YS Jagan : త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఆరు ఎమ్మెల్యే ఖాళీలకు మార్చి 15న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఏమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇటీవల మృతి చెందిన తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుమారులకు అవకాశం కల్పించారు. దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ చక్రవర్తి, రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా భగీరథరెడ్డిలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన ఇక్బాల్ కు ఎమ్మెల్సీగా రెండవ సారి అవకాశం ఇచ్చారు. వీరితో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్ చార్జి దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి, సీనియర్ నేత సి రామచంద్రయ్య, విజయవాడకు చెందిన మాజీ కార్పోరేటర్ కరీమున్సీసాను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ఆరుగురు ఎమ్మెల్సీలలో ఇద్దరు ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పించడం విశేషం.
కాగా వైసీపీలో ఎమ్మెల్సీ ఆశావహులు చాలా మందే ఉన్నారు. పలువురు నేతలకు సీఎం జగన్ స్వయంగా ఎమ్మెల్సీ హామీలు కూడా ఇచ్చి ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో ఆ నాయకులకు అవకాశం కల్పించకపోవడంతో వారి అనుయాయులు నిరుత్సాహానికి గురి అయ్యారు.