India Today Survey: ఏపి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాల్లో ఎక్కడా కోత లేకుండా అప్పులు చేసి మరీ సంక్షేమ రధాన్ని పరుగులు తీస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్న పథకాలను 90 శాతం అమలు చేశారు. పలు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నా, కోర్టు అక్షింతలు వేసి జివోలను తప్పుబడుతున్నా అవేమీ ప్రభుత్వం పట్టించుకోకుండా కోట్లాది రూపాయలు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నారు. పలు సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతున్నాయి. సంక్షేమ పథకాలకు సంబందించి జగన్మోహనరెడ్డి సర్కార్ లో పంపిణీ లు జరుగుతున్నట్లుగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదని కూడా చెప్పవచ్చు.
Read More: Viveka Murder Case: సీబీఐ విచారణకు హజరైన ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి
రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలివేసి ప్రజా సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి పెట్టారన్న విమర్శలు కూడా జగన్ సర్కార్ పై ఉంది. అయితే పేద మధ్య తరగతి వర్గాలకు ఇంత మేర లబ్దిచేకూరుస్తున్నా సీఎంగా జగన్మోహనరెడ్డి గ్రాఫ్ పడిపోవడంతో వైసీపీ అభిమానులు, వివిధ పథకాల లబ్దిదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే “మూడ్ ఆఫ్ ద నేషన్” పేరిట ప్రతి ఏటా ముఖ్యమంత్రుల పనితీరుపై సర్వే చేస్తూ ర్యాంకింగ్ లు ఇస్తుంటుంది. గత ఏడాది ఈ సంస్థ సర్వేలో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నాలుగో ప్లేస్ లో ఉన్నారు. ఇదే సంస్థ ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో టాప్ టెన్ లో జగన్ పేరు లేదు.
అభిమానులు ఈ సర్వే రిపోర్టును కొట్టి పారేయడానికి వీలు లేదు. ఎందుకంటే గతంలో నాల్గవ స్థానంలో ఉన్నట్లు ప్రకటించగా వైసీపీ శ్రేణులు ఉబ్బితబ్బిబైయ్యారు. అయితే ఏ రాష్ట్ర సీఎం పని తీరు ఏ విధంగా ఉంది అన్న దానిపై ఆయా రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలతోనే ఇండియా టుడే సర్వే నిర్వహిస్తుంది. సీఎంల పనితీరు మదించే క్రమంలో వారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. పాలనా తీరు తెన్నులు, స్వచ్చ పాలన, జవాబుదారీ తనం ఇలా అనేక అంశాలపై ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించి రేటింగ్, ర్యాంకులు ఇస్తుంటుంది.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జగన్మోహనరెడ్డి సర్కార్ సంక్షేమ పథకాలు అమలు తప్ప ఇక ఏమీ పట్టించుకోవడం లేదని అందుకే టాప్ టెన్ లో చోటు లేకుండా పోయిందని అనుకుంటున్నారు. గత ఏడాది కంటే జగన్ పాలనకు 11 శాతం ప్రజాదరణ ఈ సారి తగ్గిపోయినట్లు సర్వే తేల్చిందట. తొలి సారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్ మొదటి స్థానంలో ఉండటం, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా సీఎంలు మమత బెనర్జీ, పినరయి విజయన్, నవీన్ పట్నాయక్ లు టాన్ టెన్ లో పదిలంగా ఉండటం, ఏపి, తెలంగాణ సీఎంల పేర్లు లేకపోవడంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజానీకంలోనూ చర్చ జరుగుతోంది. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో ప్రతిపక్షాలు విమర్శించడానికి మరో ఆయుధం దొరికినట్లు అయ్యింది. ఈ సర్వే రిపోర్టుతో అయినా సీఎం జగన్ తన పనితీరులో మార్పు తెచ్చుకుంటారా ? లేక “సీతయ్య ఎవరి మాట వినడు” అన్నట్లుగా ముందుకు సాగుతారో వేచి చూడాలి.