AP CRDA: అమరావతి రాజధాని అంశంపై ఇటీవల హైకోర్టు కీలక తీర్పు వెలువడించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు లేఖలు అందజేస్తోంది. రైతులు పొందిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొంది. సీఆర్డీఏ సిబ్బంది రైతుల ఇళ్లకు వెళ్లి లేఖలు అందిస్తున్నారు. సీఆర్డీఏ వెబ్ సైట్ లో మూడు రోజుల ముందు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. భూపత్రాలు ఇచ్చి ఈ నెల 31వ తేదీలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సీఆర్డీఏ అధికారులు సూచిస్తున్నారు.
AP CRDA: రైతులకు సీఆర్డీఏ లేఖలు
కాంపిటెంట్ అథారిటీ అండ్ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ పేరుతో లేఖలను రైతులకు అందజేస్తున్నారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే సీఆర్డీఏ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నారు. లేకపోతే కార్యాలయానికి ఫోన్ చేసి అయినా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పులో మూడు నెలల్లో అమరావతి ప్రాంతంలో ప్లాట్ లు అభివృద్ధి చేసి రైతులకు అందజేయాలని పేర్కొంది. అయితే మూడు నెలల్లో ఎలా సాధ్యం అవుతుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణే స్వయంగా అన్నారు.
AP CRDA: మూడు రాజధానులే ప్రభుత్వ విధానం అంటూ
హైకోర్టు నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వ పెద్దలు మాత్రం పరిపాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని అంటున్నారు. మరో పక్క కొత్తగా మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్దం అవుతోందని వార్తలు వినబడుతున్నాయి. ఓ పక్క మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రులు పేర్కొంటున్న తరుణంలో సీఆర్డీఏ నుండి రైతులకు లేఖలు అందడం, ప్లాట్ లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.