AP credai : ఏపి క్రెడాయ్ కార్యవర్గ సభ్యులు బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణతో భేటీ అయ్యారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీరు మంత్రి బొత్సాతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ఒక ఎకరం విక్రయిస్తే ఆంధ్రలో మూడు ఎకరాలు కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రలో భూముల ధరలు తగ్గాయనీ, తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి అన్నట్లుగా కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపిలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్రంలో ఈ పరిస్థితులు రావడానికి కారణం మీరంటే మీరని వైసీపీ, టీడీపీ విమర్శించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపిలో రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న పరిస్థితులపై క్రెడాయ్ ప్రతినిధులు మంత్రి బొత్సా సత్యనారాయణతో చర్చించారు.
ఏ పి క్రెడాయ్ అధ్యక్షుడు రాజా శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని చెప్పారు. కరోనా కారణంగా సొంత ఇంటి విలువ చాలా మందికి తెలిసి వచ్చిందన్నారు. గత కొద్ది రోజులుగా ఇళ్లు, ప్లాట్ ల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని తెలిపారు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవించామని చెప్పారు.
ప్రధానంగా స్టాంప్ డ్యూటీ డిడక్షన్ వల్ల ప్రజలకు ఎంతో భారం తగ్గుతుందని తెలిపారు. సిమెంట్, ఐరన్ ధరలను ఉద్దేశపూర్వకంగా సిండికేట్ అయ్యి పెంచేస్తున్నారనీ ఆయన ఆరోపించారు. ఈ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ధరలను నియంత్రించాలని రాజా శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు అమాంతం పెరిగిపోవడంతో నిర్మాణ రంగం సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.