AP CS Adityanath das: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విషయంలో ఏపి ప్రభుత్వ వినతికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఏపి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ డీవోపిటీ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆదిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అయితే అదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్స్టెన్షన్ ఉత్తర్వుల నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఆదిత్యనాథ్ దాస్ సీఎస్ గా కొనసాగనున్నారు.
నీలం సాహ్ని తరువాత ఆదిత్యనాద్ దాస్ ఏపి సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర సర్వీసుల నుండి సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మను రాష్ట్రానికి పంపించాలని ఏపి ప్రభుత్వం ఇటీవల కోరిన నేపథ్యంలో ఆయనను కేంద్రం రిలీవ్ చేసింది. దీంతో ఆదిత్యనాధ్ దాస్ పదవీ కాలం ఎక్స్ టెన్షన్ రాకుంటే సమీర్ శర్మను సీఎస్ గా నియమించే అవకాశాలు ఉన్నయంటూ తొలుత వార్తలు వచ్చాయి.