రాష్ట్రంలో స్థానిక పంచాయతీ ఎన్నికల వ్యవహారం హాట్ హాట్ గా మారుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రేపు ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నద్దం అవుతున్నారు. మరో పక్క ఉద్యోగ సంఘాల నేతలు ఒక పక్క ప్రభుత్వాన్ని, మరో పక్క ఎస్ఈసీని కలిసి ఎన్నికల విధుల్లో నిర్వహించలేమంటూ లేఖలు అందించారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టులో పిటిషన్ లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్ లపై సోమవారం విచారణ జరగనున్నది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాధ్ దాస్ ఏడు పేజీల లేఖ రాశారు. ఎన్నికలు కొనసాగించవద్దని లేఖలో నిమ్మగడ్డను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఆ తీర్పు కోసం వేచి ఉన్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున ఎన్నికల విధుల్లో పాల్గోనే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని స్పష్టం చేస్తూ పరిస్థితులు అనుకూలించిన తరువాత ఎస్ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని సీఎస్ పేర్కొన్నారు.
ఎన్నికల షెడ్యుల్ కు ముందే ఎన్నికల సంసిగ్ధతపై రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుందని పరిస్థితులు అనుకూలించిన తరువాత సమావేశాలకు సంబంధించి నిర్ణీత తేదీలను తెలియజేస్తామని పేర్కొన్నారు. కొంత మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ కోరిందనీ, ఎలాంటి ప్రక్రియ పాటించకుండా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారన్నారు. ప్రస్తుతం వారంతా వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. అయితే సీఎస్ లేఖపై ఎస్ ఈ సీ ఇంత వరకూ స్పందించలేదు.
మరో పక్క ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ పై ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఏపి ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలకు ఉద్యోగులు భయపడుతున్నారని వ్యాక్సిన్ ఇచ్చే వరకూ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని ఆయన కోరారు. ఒక వేళ ఎన్నికలు నిర్వహించాలంటే కేవలం అంగీకారం తెలిపిన ఉద్యోగులనే వాడుకోవాలని ఆయన అన్నారు.