AP CS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఆదిత్యనాథ్ దాస్ పదవి కాలాన్ని పొడిగించాలంటూ జగన్మోహనరెడ్డి సర్కార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గతంలో నీలం సాహ్నిని మూడు మాసాలు చొప్పున రెండు సార్లు ఎక్స్టెన్షన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. అదే మాదిరిగా ఆదిత్యనాథ్ దాస్ కు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఆదిత్యనాథ్ దాస్ విషయంలో కొంత సందిగ్దత నెలకొంది. ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని పొడిగించ డం సమంజసం కాదనీ, ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు వేరువేరుగా కేంద్రానికి లేఖలు రాశారు. గతంలో ఆదిత్యనాథ్ దాస్ పై ఉన్న కేసుల ప్రస్తావన తీసుకువస్తూ వారు కేంద్రానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆదిత్యనాథ్ దాస్ ఎక్స్ టెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసుల నుండి సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మను రిలీవ్ చేయాలంటూ కూడా మరో లేఖ రాయగా వెంటనే స్పందించిన కేంద్రం సమీర్ శర్మ ను కేంద్ర సర్వీసుల నుండి శుక్రవారం రిలీవ్ చేసింది. నేడో రేపో ఆయన సమీర్ శర్మ ఏపి ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నారు. సమీర్ శర్మను కేంద్ర సర్వీసుల నుండి సిబ్బంది వ్యవహారాల శాఖ రిలీవ్ చేసింది. కేంద్రంలో కార్పోరేట్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ గా సమీర్ శర్మ బాధ్యతల నిర్వహించారు. ఈ నెలాఖరులుగా ఆదిత్యనాథ్ దాస్ ఎక్స్టెన్షన్ పై కేంద్రం నుండి సానుకూల నిర్ణయం వెలువడకపోతే సమీర్ శర్మను సీఎస్గా నియమించే అవకాశాలు ఉన్నాయి. అందు కోసమే రాష్ట్ర ప్రభుత్వం సమీర్ శర్మను కేంద్ర సర్వీసుల నుండి రిలీవ్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
1987 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆదిత్యనాథ్ దాస్ గత ఏడాది డిసెంబర్ 31న ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మ 1985 ఐఏఎస్ బ్యాచ్ అధికారి.