రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారంటూ విమర్శించడంతో పాటు పోలీసులకు కులం, మతం ఫలానా అంటూ ఆరోపణలు చేయడంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించారు. 2015 సంవత్సరం నుండి నేటి వరకూ రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు కులమతాల ఆధారంగా పని చేయరనీ దేశ సమగ్రత కాపాడటం కోసం పని చేస్తారని పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని డీజీపీ సవాంగ్ అన్నారు.
దేవాలయాలకు సంబంధించి 2015లో 163, 2016లో 207, 2017లో 139, 2018లో 123, 2019లో 177, 2020లో 143 కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరిలో ఆరు కేసులు నమోదు అయ్యాయన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ తరువాత దేవాలయాల్లో ప్రాపర్టీ అఫెన్స్ కు సంబంధించి 180 కేసులను ఛేదించి 337 మందిని నేరస్తులను అరెస్టు చేశామని డీజీపీ పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 5 తరువాత ప్రధానమైన కేసులు 44 జరగ్గా అందులో 29 కేసుల్లో 80మంది కరుడు గట్టిన అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. 15 కేసుల్లో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ఆలయాలపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలకు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకూ 4,614 మందిని అదుపులోకి తీసుకున్నట్లు గౌతమ్ సవాంగ్ చెప్పారు. 2020 సెప్టెంబర్ 5వ తేదీ ముందు వరకూ రాష్ట్రంలో 3,697 ప్రార్థనా మందిరాల్లో 13,273 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా అప్పటి నుండి 2021 జనవరి 12వ తేదీ వరకూ 13,089 ప్రార్థనా మందిరాల్లో రికార్డు స్థాయిలో 43,824 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,871 ప్రార్థనా మందిరాలను సీసీ కెమెరాల నిఘాతో జియో ట్యాగింగ్ చేశామన్నారు.
ఆలయాల రక్షణ కోసం విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఇందు కోసం 15,394 మందిని నియమించడం జరిగిందన్నారు. మరో 23,256 మందిని నియమించాల్సి ఉందనీ, ఇంకో 7,862 మంది నియామకం కోసం కసరత్తు జరుగుతోందని సవాంగ్ చెప్పారు. రామతీర్థం ఆలయంలో మూడు నెలల క్రితమే భద్రత పెంచామనీ, అదనంగా 16 సీసీ కెెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే కొండ పైన ఉన్న దేవాలయాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదన్నారు. అంతర్వేది రథం దహనం ఘటన దర్యాప్తును సీీబీఐ కి ఇవ్వడం జరిగిందని సవాంగ్ తెలిపారు. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయనీ, అయినప్పటికీ సమర్థవంతంగా పోలీసులు పని చేశారని గౌతమ్ సవాంగ్ వివరించారు.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఆలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సీఎం, హోం మినిస్టర్, డీజీపీ ముగ్గురూ క్రిస్టియన్ లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై డీజీపీ గౌతమ్ సంవాంగ్ కూడా నేడు స్పందించారు. చంద్రబాబు హయాం నుండి ఇప్పటి వరకూ జరిగిన దాడుల వివరాలు వెల్లడించారు. చంద్రబాబు హయాంలోనూ 2016లో రికార్డు స్థాయిలో 207 కేసులు నమోదు అవ్వడం గమనార్హం.
ఇది కూడా చదవండి..ఇచ్చింది పుచ్చుకోవడమేనంట…! వ్యాక్సిన్ లో ఆప్షన్ లేదు….!!