ఏపిలో ఇటీవల ఆలయాలపై దాడులు పెద్ద దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఘటనలపై అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ, బీజెపీ తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేయడం, వీటికి ధీటుగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రతిపక్షాల కుట్ల అంటూ వైసీపీ కౌంటర్ యటాక్ చేస్తున్న చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నేడు మంగళగిరిలో మీడియా సమావేశంలో ఆలయాలపై జరిగిన దాడులు తదితర అంశాలపై వివరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏమన్నారంటే... ఏపిలో వివిధ ఆలయాలపై జరిగిన 9 ఘటనల్లో రాజకీయ ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని స్పష్టం చేశారు. ప్రతి ఘటన తరువాత పార్టీల దుష్ప్రచారం స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలనే దురుద్దేశంతోనే ఒక పథకం ప్రకారం ఇవి చేసినట్లు కనిపిస్తోందన్నారు. ఆలయాలకు సంబంధించి ఇప్పటి వరకూ 44 ఘటనల్లో 29 కేసులను చేధించడం జరిగిందన్నారు. ఈ కేసుల్లో 81 మందిని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇక్కక ప్రధానంగా గుర్తించాల్సింది ఏమిటంటే 9 కేసులలో 21 మంది రాజకీయ పార్టీల కార్యకర్తలకు ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో తేలింది.
అయితే ఆలయాలపై దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందా లేదా అనేది విషయమై సిట్ దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ సవాంగ్ తెలిపారు. అయితే దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. దుష్ప్రచారాలు, మత విధ్వేషాలు రెచ్చగొట్టడంలో రాజకీయ పార్టీల కుట్ల ఉన్నట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలిందన్నారు. అంతర్వేది ఘటనలోనూ దుస్ప్రచారం ఎక్కువగా జరిగిందని అన్నారు గౌతమ్ సవాంగ్, ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ పలు చోట్ల అల్లర్లు సృష్టించారని పేర్కొన్నారు. మత విధ్వేషాలను రెచ్చగొడుతూ వదంతులను వ్యాప్తి చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, వివిధ మతాలకు చెందిన ప్రముఖలతో మత సామరస్య కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.