కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకల నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత పెద్ద ఎత్తున వినాయక చవితి వేడుకల నిర్వహణకు ఉత్సవ కమిటీ నిర్వహకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపి డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి వినాయక చవితి వేడుకల నిర్వహణకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. వినాయక చవితి నిమజ్జనం ఘనంగా జరుపుకోవడానికి పోలీసు శాఖ సహకారం అందిస్తుందని చెప్పారు. పోలీస్ శాఖ వినాయక నిమజ్జనం కొరకు ఎటువంటి ప్రత్యేక ఆంక్షలు విధించటం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎప్పటిలాగే వినాయక నిమజ్జనం ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత ఎస్పీ లేదా కమిషనర్, డీఐజీను సంప్రదించాలని తెలియజేశారు.
పోలీసు సిబ్బంది సైతం నిమజ్జన కమిటీలతో సమన్వయం చేసుకుని పని చేస్తున్నాయని చెప్పారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకోదల్చిన వారు సంబంధిత పోలీస్ స్టేషన్ లలో సమాచారం అందించాలని ఆయన తెలిపారు. ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి మాత్రం తప్పనిసరి అని చెప్పారు. నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన వివరాలను నిర్వహకులు పోలీసు శాఖకు తెలియజేయాలని చెప్పారు. పోలీసులు అనుమతించిన నిమజ్జన మార్గాలలోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలని తెలిపారు.
పందిళ్ళు, మండపాలు వద్ద శబ్ధ కాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నింబంధనలు 2000 ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలగకుండా స్పీకర్లను ఉపయోగించాలని చెప్పారు. స్పీకర్ లను ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఉపయోగించాలని వెల్లడించారు. మండపాల వద్ద క్యూలను మేనేజ్ చేసే భాద్యతను పోల్లీసు శాఖ తో పాటు ఉత్సవ కమిటీ సహాయ సహకారాలు ఎంతైనా అవసరమని డీజీపీ అన్నారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలని డీజీపీ సూచించారు. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహ నిమజ్జన ఊరేగింపు, వేషధారణలు, డీజేలపై స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు.