రాజధాని రైతులు ఈ నెల 12న అమరావతి నుండి అరసవల్లి వరకూ తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందన్న కారణంగా అనుమతి నిరాకరిస్తున్న ఏపి పోలీస్ బాస్ రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం అర్దరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉత్తర్వులను అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత పంపారు. అనుమతిని నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులో ఈ విధంగా పేర్కొన్నారు. ఓ వైపు మహాపాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లలో రైతు నాయకులు ఉండగా, వారికి షాక్ ఇచ్చేలా డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
తమ పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదంటూ అమరావతి రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల పాదయాత్ర విషయంలో పోలీసుల నిర్ణయం గురువారం సాయంత్రం లోగా తెలియజేయాలని లేకుంటే శుక్రవారం ఉదయం మొదటి కేసుగా దీన్ని విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపి పోలీసులు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పాదయాత్రకు అనుమతి ఎందుకు నిరాకరించడం జరుగుతుందో అందులో వివరంగా పేర్కొన్నారు. పాదయాత్ర లో 200 మంది పాల్గొంటారనీ చెప్పారనీ, సంఖ్య పెరిగితే ఒక్కో బృందంలో 200 మంది చొప్పున వేర్వేరుగా యాత్ర చేపడతామని చెప్పినప్పటికీ శాంతి భద్రతల విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో అనుమతి నిరాకరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. యాత్ర సాగే జిల్లాల పోలీసుల నుండి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
ఇదే క్రమంలో గత ఏడాది అమరావతి నుండి తిరుపతి వరకూ చేపట్టిన యాత్రకు కోర్టు ఆదేశాలతో షరతులతో కూడిన అనుమతి ఇస్తే ఆ షరతులన్నింటినీ ఉల్లంఘించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ సందర్భంలో వివిధ జిల్లాల్లో మొత్తం 71 క్రిమినల్ కేసులు నమోదు కాగా, రెండింటిలో శిక్షలు కూడా పడ్డాయని వివరించారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎంత మంది పాల్గొంటారు అన్న విషయంలో మీకే స్పష్టమైన అవగాహన లేదనీ, ఎవరు వస్తారో తెలియనప్పుడు వారిని గుర్తించడం, పర్యవేక్షించడం అధికారులకు కష్టమవుతుందని అందుకే అనుమతి నిరాకరిస్తున్నట్లు ఉత్తర్వులో వివరించారు. మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని, కాబట్టి భద్రత కల్పించడం సాధ్యం కాదని అన్నారు. ఇటీవల జిల్లా పేరు విషయంలో కోనసీమలో రెండు వర్గాలు ర్యాలీ చేయడం వల్ల శాంతి భద్రతల సమస్యగా మారి మంత్రి, ఎమ్మెల్సీ ఇళ్లు తగలబెట్టడం వరకూ వెళ్లిందనీ, శ్రీకాకుళం జిల్లాలోనూ రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోందనీ, పాదయాత్ర ఆ జిల్లాల మీదుగా సాగనుంది కాబట్టి పాదయాత్ర క్రమంల ఏ చిన్న గొడవ జరిగినా అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాల్ని విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మహాపాయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు డీజీపీ ఉత్తర్వులో స్పష్టం చేశారు.
ఏపి రాజధాని అమరావతిలో మరో కీలక ప్రతిపాదన చేసిన జగన్ సర్కార్
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?