AP Districts Bifurcation: ఏపిలో జిల్లాల పునర్విభజన కార్యక్రమంలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల విభజన చేసిన తీరుపై పలు ప్రాంతాలలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తమ ప్రాంతాలు జిల్లా కేంద్రానికి దూరం అవుతాయని పేర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్ లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది.
Read More: Guntur Jinnah Tower: రంగు పడింది.. వివాదం ముగిసింది..వైసీపీ మాస్టర్ ప్లాన్ అదుర్స్
AP Districts Bifurcation: ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు
గుంటూరు జిల్లాలో నాలుగు మండలాలను నరసరావుపేట రెవెన్యూ డివిజన్ కు మార్పు చేసింది. అదే విధంగా పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాలను నరసరావుపేట డివిజన్ కు మార్చింది. మరో పక్క అనంతపురం జిల్లాలోనూ కొన్ని మార్పులు చేసింది. అనంతపురం జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్ ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేసింది. ధర్మవరంలో ఉన్న నాలుగు మండలాలను పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ కు మార్పు చేసింది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్ లో కలిపింది.
కొత్త జిల్లాలు ఉగాది లోపు
జగన్మోహనరెడ్డి సర్కార్ ఎటువంటి ముందస్తు ఊహాగానాలకు తావు లేకుండా అకస్మాత్తుగా జిల్లాల పునర్విభజనను తెరపైకి తీసుకువచ్చింది. జగన్ అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రి అత్యవసర మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియకు ఆమోదం తెలిపి నోటిఫికేషన్ విడుదల చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. కొందరు కావాలనే వివాదాన్ని రేకెత్తిస్తున్నారని వారు ఆరోపించారు. ఏపిలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఉగాది లోపు పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడంతో పాటు మేనిఫెస్టోలోనూ పొందుపర్చారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేష్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటునకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు 30 రోజుల్లోగా తెలియజేయాలని కోరింది.