AP EAP CET: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితుల కారణంగా విద్యాసంవత్సరం కుదుపులకు గురి అవ్వడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ ను ఆగస్టు 19 నుండి 25 వరకూ కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ ను సెప్టెంబర్ 17,18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 19న ఈ సెట్ (అనంతపురం జేఎన్టీయూ), సెప్టెంబర్ 21న ఎడ్ సెట్ (విశాఖ ఏయూ) లో పరీక్షలు జరగనున్నాయి. తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న లాసెట్, సెప్టెంబర్ 27 నుండి 30 వరకూ పీజీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.