AP Inter Exams: ఏపిలో షెడ్యుల్ ప్రకారం మే 5వ తేదీ నుండి 23వ తేదీ వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. జేసి, ఆర్ఐఓ, డీఇఓలతో మంత్రి సురేష్ మాట్లాడారు. అన్ని జిల్లాల్లో అధికారులు కోవిడ్ పై జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యం అని గుర్తించాలన్నారు.
ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదనీ, కొన్ని చోట్ల నిర్వహిస్తుండగా, మరి కొన్ని చోట్ల వాయిదా వేశారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పరీక్షలను అనవసరంగా రాద్ధాంతం చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్, కమిషనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంటర్ పరీక్షలను వాయిదా వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేసే ఉద్దేశం లేదన్నట్లు నిర్ణయాన్ని స్పష్టం చేసింది. పరీక్షల ఏర్పాట్లకు అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తోంది.