AP Electricity Tariffs: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు మరో సారి భారం పడుతోంది. విద్యుత్ చార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయం తీసుకుంది. పెరిగిన విద్యుత్ టారిఫ్ ను బుధవారం ఏపిఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి విడుదల చేశారు. కొత్త టారిఫ్ ప్రకారం 30 యూనిట్ల వరకూ వాడకం దారులకు యూనిట్ కు 45 పైసలు పెంచారు. 31 నుండి 75 యూనిట్ల వారికి యూనిట్ కు 91 పైసలు పెంచారు. 76 నుండి 125 యూనిట్ లు వాడకం దారులకు యూనిట్ కు రూ.1.40లు, అలానే 126 నుండి 225 యూనిట్లు వాడకం దారులకు యూనిట్ కు రూ.1.57లు, 226 నుండి 400యూనిట్ ల వరకూ యూనిట్ కు రూ.1.16లు, 400 యూనిట్ లు పైన వారికి 55 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయిదు కేటగిరిలను రద్దు చేసి కొత్త గా ఆరు శ్లాబులు ఏర్పాటు చేసినట్లు చైర్మన్ నాగార్జునరెడ్డి తెలిపారు.
AP Electricity Tariffs: స్లాబ్ల వారిగా..
30 యూనిట్ ల వరకూ ఉన్న స్లాబ్ కు రూ.1.90లు చొప్పున వసూలు చేయనున్నారు. 31 నుండి 75 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్ కు యూనిట్ కు రూ.3లు వసూలు చేసుకునేందుకు డిస్కమ్ లకు అనుమతి ఇచ్చారు. ఇక 76 నుండి 125 యూనిట్ల మధ్య ఉన్న స్లాబ్ కు యూనిట్ ధర రూ.4.50లు చేశారు. 126 నుండి 225 యూనిట్ల ఉన్న స్లాబ్ లో యూనిట్ కు రూ.6లు, 226 నుండి 400 యూనిట్ల వరకూ ప్రతి యూనిట్ కు 8.75లు చొప్పున వసూలు చేయనున్నారు. 400 పైన యూనిట్ల వాడకం దారులకు యూనిట్ కు రూ.9.75లు చొప్పున పెంపుదలకు అనుమతి ఇచ్చారు. ధరల పెంచడం ఇబ్బంది అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితి నెలకొందని అన్నారు చైర్మన్ నాగార్జునరెడ్డి. పెరిగిన చార్జీలతో పంపిణీ సంస్థలకు రూ.1400 కోట్ల అదనపు ఆదాయం చేకూరుతుందని నాగార్జునరెడ్డి తెలిపారు.
AP Electricity Tariffs: విద్యుత్ చార్జీల పెంపుపై మండిపడుతున్న ప్రతిపక్షాలు..ఆందోళనకు పిలుపు
కాగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడో సారి విద్యుత్ చార్జీలు పెంచారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. వైసీపీ సర్కార్ విద్యుత్ చార్జీలు పెంచి పేదలపై భారం మోపిందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ ధరల పెంపును నిరసిస్తూ ఉద్యమాలను ఉదృతం చేస్తామని ప్రకటించారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచి ప్రజలకు వేసవి షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తక్షణమే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. విద్యుత్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ధరల పెంపును నిరసిస్తూ గురువారం విజయవాడలో ఆందోళన చేస్తునట్లు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. ఏప్రిల్ 4న రాష్ట్ర వ్యాప్త నిరసనలు, 7న విశాఖలో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు శైలజానాథ్.