AP Employees JAC: ఏపిలో ఉద్యోగ సంఘాల నేతలు మళ్లీ ఉద్యమ బాటకు సన్నద్దం అవుతున్నారు. ప్రభుత్వం నుండి పీఆర్సీపై స్పష్టత రాకపోవడంతో ఆందోళన చేయకతప్పదని భావిస్తున్నారు. పీఆర్సీతో సహా మొత్తం 70 డిమాండ్లకు సంబంధించిన వినతులను ప్రభుత్వానికి ఇస్తే చర్చల పేరుతో కాలయాపన చేస్తుందన్న నిర్ణయానికి వచ్చారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ మేరకు దశవారీగా చెపట్టిన ఆందోళనను విరమించినా ఉపయోగం లేకుండా అయిందని ఆవేదన చెందుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. మొక్కుబడిగా చర్చలకు పిలిచి అధికారులు తమను అవమానించారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
AP Employees JAC: 9న రాష్ట్ర కార్యవర్గ భేటీ
ఉద్యోగుల బకాయిలు ర.1600 కోట్ల నుండి రూ.2100 కోట్లకు పెరిగాయని ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు పేర్కొన్నారు. బకాయిలు మార్చి లోగా చెల్లిస్తామని హామీ ఇస్తున్నారనీ, వంద కోట్లు ఇచ్చి రెండు వేల కోట్ల బిల్లులు వెనక్కి పంపాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. తమను సీఎం వద్దకు తీసుకువెళ్లకుండా అధికారులు ఎందుకు కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని బొప్పరాజు హెచ్చరించారు. తాము ఫ్రెండ్లీ ప్రభుత్వంగా భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం తమపై వివక్షత చూపిస్తోందని బండి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఆర్సీతో సహా 70 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ పైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని వాపోతున్నారు.
ఆఖరి అస్త్రంగా సమ్మె
తొమ్మిదవ తేదీన జరిగే ఉద్యోగ సంఘాల ఐక్య జేఏసి భేటీలో చర్చించిన అనంతరం ఉద్యమ ప్రణాళిక ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. ముందుగా జిల్లా స్థాయిలో ఉద్యమాన్ని నిర్వహించి తర్వాత చలో విజయవాడకు ప్లాన్ చేస్తున్నారు. తమ డిమాండ్ లు పరిష్కారం కావాలంటే ప్రభుత్వానికి సహాయ నిరాకరణే మార్గమన్న నిర్ణయానికి వచ్చారు. సంక్రాంతి పండుగ తరువాత ఆఖరి అస్త్రంగా సమ్మెకు పిలుపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు మరో మారు ఆందోళన బాట పట్టకమునుపే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.