AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి సొమ్ము విత్ డ్రా కావడంపై నేతలు ప్రశ్నించారు. దీనిపై ఇది ఎలా జరిగిందో తెలియడం లేదనీ, దీనిపై విచారణ చేసి స్పష్టత ఇస్తామని అధికారులు ఉద్యోగ సంఘాల నేతలకు సమాధానమిచ్చారు. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామనీ, కింద స్థాయి అధికారుల నుండి నివేదిక తెప్పించుకుని సమస్య పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు జమ చేయడం, విత్ డ్రా చేయడంపై సీఎఫ్ఎంఎస్ లో సాంకేతిక సమస్య ఉండవచ్చనీ, జరిగిన పొరపాటుకు సంబంధించి అధికారుల నుండి వివరణ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆర్ధిక శాఖ అధికారిని కలిసిన తరువాత బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ సీఎఫ్ఎంఎస్ లో జరిగిన పొరపాటును ఆర్ధిక శాఖ అధికారులు అంగీకరించారని తెలిపారు. ఆందోళన చెందవద్దనీ, సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 90వేల ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్ ఖాతా నుండి వారికి తెలియకుండానే రూ.800 కోట్ల మాయం అయ్యాయని ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ నిన్న వెల్లడించారు. దీనిపై అన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేస్తామన్నారు.
అయితే ఇతర ఉద్యోగ సంఘాల నేతలు సూర్యనారాయణ ప్రతిపాదనను వ్యతిరేకించారు. సమస్య ఎదురైనప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలి కానీ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. గతంలోనూ ఇదే విధంగా జీపీఎఫ్ ఖాతాలో నిధులు మాయం కాగా ఉద్యోగ సంఘాల నేతలు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తిరిగి జీపీఎఫ్ ఖాతాలకు నగదు జమ చేశారు.