విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) ఇంధన ఎక్సేంజీల నుండి జరిపే రోజు వారి కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ బకాయిల అంశంపై ఏపి ఇంథన కార్యదర్శి విజయానంద్ క్లారిటీ ఇచ్చారు. పవర్ ఎక్సేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఏపి ఎలాంటి బకాయిలూ లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపి బకాయిలు లేనట్లుగా కేంద్రం ఇచ్చిన జాబితాలో నమోదైందని ఆయన తెలిపారు.
దీంతో విద్యుత్ క్రయ విక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేదం ఏపికి వర్తించదని విజయానంద్ పేర్కొన్నారు. ఏపి డిస్కంలు చెల్లించాల్సిన రూ.350 కోట్ల ఇప్పటికే చెల్లించామని తెలిపారు. సమాచార లోపం వల్లనే విద్యుత్ క్రయ విక్రయాల నిషేదిత జాబితాలో ఏపి పేరు నమోదైందని ఆయన చెప్పారు. ఏపి చెల్లించిన బకాయి మొత్తం ఎక్సేంజీలో నమోదు కాకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని విజయానంద్ స్పష్టం చేశారు.