క్యాసినో నిర్వహకులు చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈడీ దాడుల ద్వారా పలు పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి నివాసాల్లో సోదాల సమయంలో పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలతో సంబంధాలను గుర్తించినట్లు తెలుస్తొంది. భారీ మొత్తంలో నగదు చెల్లింపులు హవాలా ద్వారా జరిగినట్లు చెబుతున్నారు. చీకోటి ప్రవీణ్ కాల్ డేటా, వాట్సాప్ మేసేజ్ ల ను పరిశీలించిన ఈడీ అధికారులు.. అతనితో లావాదేవీలు నిర్వహించిన వారికీ నోటీసులు జారీ చేసే అలోచనలో ఉన్నట్లు తెలుస్తొంది.
తెలుగు రాష్ట్రాల్లో పలువురు అధికార పార్టీ ప్రముఖులు చీకోటి ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసినో వ్యవహారంపై ఏపి తాజా మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. క్యాసినో వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్ తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అతనితో గానీ, హవాలాతో కానీ తనకు సంబంధం లేదని చెప్పారు. తాను పేకాట ఆడతానని గతంలోనే ఒప్పుకున్నానన్నారు. తాను క్యేసినోకి ఎప్పుడైనా వెళ్లి వస్తుంటానని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని బాలినేని అన్నారు.