Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్ పేరు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించిన సందర్భంలో జగన్ సర్కార్ ఆయనకు ఎస్ఈసీ పదవి ఇచ్చింది. తమిళనాడుకు చెందిన రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కనగరాజు. అయితే ఆయన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే పదవి నుండి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిమ్మగడ్డ హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో తిరిగి ఎస్ఈసీ గా బాధ్యతలు చేపట్టారు నిమ్మగడ్డ. ఈ వ్యవహారం అంతా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకుంటే జస్టిస్ కనగరాజ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. అనాడు పదవి పొగొట్టుకున్న జస్టిస్ కనగరాజ్ కు ప్రభుత్వం మరో కీలక పోస్టు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ పదవీ విరమణ తర్వాత కనగరాజ్ ను మళ్లీ ఆ పదవిలో నియమిస్తారని భావించినప్పటికీ అనూహ్యంగా ఆ పదివిని సీఎస్గా పదవీ విరమణ చేసిన నీలం సాహ్నికి అప్పగించారు సీఎం జగన్.
అయితే కనగరాజ్ కు ఏదో విధంగా న్యాయం చేయాలన్న ఆలోచనలో జగన్ సర్కార్ ఉంది. ఈ తరుణంలో రాష్ట్రంలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ) ఏర్పాటుకు ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ అథారిటీ చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ ను నియమించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ పదవిలో ఆయనను నియమిస్తే సముచిత గౌరవం ఇచ్చినట్లు అవుతుందనేది జగన్ సర్కార్ భావన. ఈ క్రమంలోనే పోలీసుపై ఫిర్యాదులను విచారించే పీసిఏ ఏర్పాటు యోచనలో ప్రభుత్వం ఉంది. పోలీసులు బాధితులకు న్యాయం చేయకపోయినా, బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించకపోయినా, సకాలంలో బాధితులకు న్యాయం జరగకపోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ అథారిటీలు ఏర్పాటు అయ్యాయి.
Read More: AP SEC ; జస్టిస్ కనగరాజ్ కథ ఏమైనట్టు..!? మరో కీలక పదవికి పిలుస్తారా..!?
తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం జనవరి నెలలోనే పీసీఏను ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని చైర్మన్ గా పీసీఏను ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. పీసీఏలో రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ తో పాటు స్వచ్చంద సంస్థల నుండి ప్రభుత్వం ఎంపిక చేసిన ఓ వ్యక్తి సభ్యులుగా ఉంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఈ అథారిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నుండి నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో జస్టిస్ కనగరాజ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.