AP Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) పెంచింది. ఉద్యోగులకు 3.144 శాతం మేర కరువు భత్యాన్ని పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పెంపుదలతో ఉద్యోగి మూల వేతనం పై 30.392 శాతం నుండి 33.536 శాతానికి డీఏ పెరిగినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. డీఏ పెంపుదల 2019 జనవరి 1వ తేదీ నుండి వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, పాఠశాలలు, విద్యాలయాల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికి డీఏ పెంప వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. 2021 జూలై నెల వేతనంతో పెంచిన డీఏ చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2019 జనవరి 1వ తేదీ నుండి కరువు భత్యం బకాయిలను సమాన వాయిదాల్లో జూలై 2021 నుండి చెల్లించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా పింఛన్ దారులకు 3.144 శాతం కరువు భత్యాన్ని పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పెరుగుదలతో పింఛనుదారులకు డీఏ 33,536 శాతం పెరిగినట్లు ఉత్తర్వులో పేర్కొంది. పెంచిన డీఏ 2019 జనవరి 1వ తేదీ నుండి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.
కాగా హైదరాబాద్ నుండి అమరావతి ప్రాంతానికి తరలివచ్చిన సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డీఏ పెంపు, బకాయిల చెల్లింపులతో పాటు 30 శాతం హెచ్ఆర్ఏ మరో సంవత్సరం పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగుల సమస్యలను గురువారమే సీఎం దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పరిష్కరిస్తామని హమీ ఇచ్చారని ఏపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెఢరేషన్ చైర్మన్ కె వెంకట రామిరెడ్డి తెలిపారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.