AP Govt: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల జగడంపై కేంద్రం దృష్టి పెట్టి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించింది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను బోర్డుల పర్యవేక్షణ కిందకు తీసుకువవచ్చింది. అక్టోబర్ 14 నుండి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానుంది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై ఏపి ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై శుక్రవారం స్పందించారు.
కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయ్యేవి కాదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను అడ్డగోలుగా వదిలేశారనీ, తెలంగాణ ప్రభుత్వం ఏపి ప్రయోజనాలను గండి కొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ దూకుడుగా వ్యవహరిస్తున్నా సంయమనం పాటించామని అన్నారు సజ్జల. సీఎం జగన్ రాజ్యాంగ బద్దంగా ఒత్తిడి తెవడం వల్ల విజయం సాధించారని అన్నారు.
మరో పక్క వైసీపీ పార్లమెంటరీ పార్లీ నేత మిథున్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవన్నారు. గెజిట్ తో చాలా సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడమే తమ కర్తవ్యమని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.