ఏపిలో పంచాయతీ ఎన్నికలపై ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో ఏపి ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ లో జగన్ సర్కార్ పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్, ఎన్నికల నిర్వహణ ఏకకాలంలో సాధ్యం కాదని ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఎస్ఈసీ విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ను సస్పెండ్ చేస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన తీర్పును ధర్మాాసనం కొట్టివేసింది.
రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ విధి అని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం తప్పనిసరిగా సహకరించాల్సిందేనని హైకోర్టు తెలిపింది. ఎస్ఈసీకి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ధర్మాసనం ఆదేశించింది. సమన్వయంతో వ్యవహరిస్తేనే స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుుతాయని పేర్కొన్నది. పకృతి వైపరీత్యాలు, శాంతి భద్రతలకు విఘాతం కల్గిన సమయాల్లో ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి ఉంటుందని హైకోర్టు తెలిపింది.
తొలుత పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశమైయ్యారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బోత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, పలువురు సీనియర్ నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించారు. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చించి సుప్రీం కోర్టుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.
మరో పక్క ఉద్యోగ సంఘాలు ఎన్నికలు నిర్వహించలేమని తేగేసి చెబుతున్నాయి. గవర్నర్ దృష్టికి విషయాన్ని ఉద్యోగ సంఘాలు తీసుకువెళ్లాయి. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. గతంలో కేరళ, కర్నాటక రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల హైకోర్టు తీర్పులనే సుప్రీం సమర్థించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఏపి ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కారణం చెబుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజానీకంలోనూ తీవ్ర ఉత్కంఠతను రేపుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?