AP Government: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమంపైనే అత్యధిక ప్రాధాన్యత కనబరుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నవరత్న పథకాలను ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గానూ ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి ఓ 104 అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా 539 అంబులెన్స్ వాహనాలు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు గానూ రూ.89.27 కోట్లు ఖర్చు ప్రభుత్వం చేయనున్నది.
అంబులెన్స్ కొనుగోలుకు గానూ తక్షణం నిధులు విడుదల చేయాలంటూ ఫైనాన్స్ శాఖను ఆదేశించారు సీఎం జగన్. రాష్ట్రంలోని ప్రతి పీహెచ్సీ కి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం అనుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకానికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు మెరుగైన సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి తరలించేందుకు ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నెలలోనే అంబులెన్స్ లను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
104 అంబులెన్స్ ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందిస్తారు. ప్రతి రోజు కొన్ని గ్రామాలకు వెళ్లి అందులోని సిబ్బంది వైద్యసేవలను అందిస్తుంటారు. నేరుగా గ్రామాలకు వెళ్లి వైద్యసేవలు అందించడం వల్ల గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రంలోని పిహెచ్సీ వరకూ రావాల్సిన పని లేకుండా వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.