AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుండి ఇవ్వాల్సిన డీఏను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెం.ఎంఎస్ నెం.66 ద్వరా ఉద్యోగులకు డీఏ, జీఓ ఎంఎస్ నెం.67 ద్వారా పెన్షనర్ లకు డీఆర్ 2.73 శాతం మంజూరు చేసింది. ఈ కొత్త జీవోను జూలై 1, 2023 వేతనంతో కలిపి ప్రభుత్వం అందజేయనున్నది.

కాగా జనవరి 2022 నుండి జూన్ 2023 వరకూ ఇవ్వాల్సిన డీఏ బకాయిలను .. సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో మూడు సమాన వాయిదాలలో ఈ ఆర్దిక సంవత్సరంలో చెల్లించనున్నారు. ఈ కొత్త డీఏతో కలిసి ఉద్యోగులకు మొత్తం డీఏ 22.75 శాతం కానున్నది. డీఏ మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఏపి ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఓ పక్క తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ పలు ఉద్యోగ సంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేసింది.