AP Government: తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది. అందులో భాగంగా తొలుత డీఏ విడుదలకు సంబంధించి గుడ్ న్యూస్ అందించింది. డీఏ విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఎంప్లాయిస్ ఫేడరేషన్ (ఏపిజీఈఏఫ్) చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యుల్ కు అనుగుణంగా జనవరి నెల నుండి డీఏను జమ చేస్తారని ఆయన చెప్పారు. చాలా కాలంగా డీఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కాస్త ఊరట కల్గించింది.
AP Government: జనవరి నుండి వేతనంతో పాటు పెరిగిన డీఏ
2019 జూలై ఒకటి నుండి డీఏ బకాయిలను ఆర్ధిక శాఖ విడుదల చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది. ఆ నెల నుండి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏ బకాయిలు విడుదల చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. వచ్చే జనవరి నుండి వేతనంతో పాటు పెరిగిన డీఏ చెల్లించనున్నారు. జనవరి నుండి మూడు విడుతలుగా డీఏ బకాయిల చెల్లింపులు ఉంటాయి. డీఏలో పది శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతలకు చెల్లించనున్నారు. జడ్పీ, మండల పరిషత్ లు, గ్రామ పంచాయతీలు, ఎయిడెడ్ సంస్థలు, వర్శిటీ సిబ్బందికీ డీఏ వర్తిస్తుందని ఆర్థిక శాఖ ఉత్తర్వులో పేర్కొంది.